నవతెలంగాణ – పాట్నా : కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేడు సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సందర్భంగా ఇండియా బ్లాక్ నేతలు బీహార్లో జరిగిన సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇందులో భాగంగా లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్ జెడి నేత తేజస్వి యాదవ్, తదితర ముఖ్యనేతలు బీహార్ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు, ఎన్నికల కమిషన్ స్పెషల్ కాంప్రహెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ లేదా ఎస్ఐఆర్ ను ప్రారంభించింది. 2003 నుండి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారు వారి తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలు సహా బహుళ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని కమిషన్ జారీ చేసిన నోటీసు పేర్కొంది. వారు సమర్పించిన ప్రతాల ఆధారంగానే వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయని ఇసి పేర్కొంది. ఇంత కీలకమైన విషయంపై ఎటువంటి చర్చ లేకుండానే ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాన్ని జారీ చేయడం ప్రతిక్షాలు తప్పుపట్టాయి.

కేంద్రం ఎన్ఆర్ సి పనిని ఎన్నికల కమిషన్ ద్వారా చేయిస్తోందని ఇండియా బ్లాక్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వరా దాదాపు 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోనున్నారు. వారిలో వలస కార్మికులు, మైనారిటీ వర్గాల ప్రజలు ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎస్ఐఆర్ నిబంధన ద్వారా ఎన్నికల కమిషన్ ఓటు హక్కును హరించేందుకు ప్రయత్నిస్తోందని ర్యాలీలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ప్రత్యేకించి 2003లో నమోదు చేసుకున్న ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నించారు? మరి 2003 నుండి బీహార్లో జరిగిన అన్ని ఎన్నికలు అనైతికమా అని వారు ఈ సందర్భంగా ఇసిని ప్రశ్నించారు.