Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం

రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం

- Advertisement -

– ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో బీజేపీ ప్రభుత్వ పాలన : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఆ ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్‌ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పాలన సాగిస్తోందన్నారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సెక్యులర్‌ సోషలిజం అనే పదాలను తొలగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమనీ, తన ఎజెండాకు అనుగుణంగా దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని యత్నిస్తోందని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను తొలగించాలని చూస్తోందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకొని దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధ పరిణామాలను ప్రజలకు వివరించడం లేదన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఆదివాసీలు, దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముగాస్తూ పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన చేస్తున్న మోడీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల జ్యోతి, వీరబోయిన రవి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -