– విద్యావైద్యం, టెక్నాలజీ, ఇంధన రంగాలను బలోపేతం చేయాలి
– 2047 లక్ష్యాలను ఇండియా అప్పుడే చేరుకుంటుంది : బీపీ విఠల్ స్మారకోపన్యాసంలో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి మాంటెక్సింగ్ అహ్లూవాలియా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రణాళికలు, స్థిరమైన విధాన నిర్ణయాలు, సంస్కరణలను పకడ్బందిగా అమలు చేస్తేనే 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను ఇండియా చేరుకుంటుందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి మాంటెక్సింగ్ అహ్లూవాలియా అన్నారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) ఆధ్వర్యంలో ”చాలెంజెస్ ఆఫ్ పాలసీ మెకింగ్ ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్” అనే అంశంపై సోమవారం హైదరాబాద్లో బీపీ విఠల్ నాలుగో స్మారకోపన్యాసం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. ప్రస్తుతం భారతదేశ వృద్ధి 6.5 శాతంగా ఉందనీ, దాన్ని 8శాతానికి పెంచినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. ప్రపంచ మార్కెట్ను నియంత్రిస్తున్న అమెరికా, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ ఏర్పడిందని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటొమోబైల్, ఇంటర్నెట్, ఏఐ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని నొక్కి చెప్పారు. ఇందు కోసం దేశంలో విద్యావైద్యం, టెక్నాలజీ, ఇంధన రంగాల్లో బలమైన ముద్ర వేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికను మరింతగా తీసుకు పోవాలన్నారు.
దేశంలో నేడు వాడుతున్న టెక్నాలజీ వల్ల అనేక నగరాలు కాలుష్యకారకాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందన రంగ వాడకంలో పెద్ద ఎత్తున మార్పులు చేసి గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచాలని సూచించారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 30 ఏండ్ల తర్వాత కూడా దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడి ఉండటానికి, స్థానిక రాజకీయ విధానాలు, ప్రణాళికల అమల్లో వైఫల్యం తదితర కారణాలుగా అయన పేర్కొన్నారు. అభివృద్ధిని నగరాలకే పరిమితం చేయడం వల్ల భవిష్యత్లో ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని వికేంధ్రీకరించి గ్రామాలకు తీసుకు పోవాలని సూచించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలంటే పాలన విధానాల్లో నూతన ఆవిష్కరణలు చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని అన్నారు.
బీపీఆర్.విఠల్ బ్యూరోక్రట్గా ఆర్ధిక వేత్తగా గొప్ప ప్రణాళికలు రచించి అమలు చేశారని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని సెస్ కొనసాగిస్తూ మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. పద్మశ్రీ అవార్డు పొందిన సెస్ మాజీ చైర్మెన్ కెఎల్. కృష్ణను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, డాక్టర్ డి. సుబ్బారావు. ప్రొఫెసర్ జె. మహేందర్ రెడ్డి ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



