నవతెలంగాణ-భూపాలపల్లి
దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయని, అవకాశాలు కల్పిస్తే ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ 2025 ను సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో మహిళా శిశు దివ్యాన్గుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ నిధులు, పథకాల ద్వారా వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. దివ్యాంగులలో సృజనాత్మకత ను వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాన్గుల పధకాలు ప్రతి మారుమూల గ్రామ స్థాయికి చేర్చాలని, దివ్యాన్గులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కపిస్తే వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తారని తెలిపారు.
అధికారులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. దివ్యాన్గుల సంక్షేమం సంక్షేమ శాఖ బాధ్యతని, సంక్షేమం, సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాన్గులకు పాఠశాలల్లో విద్యాబ్యాసం, వృత్తి నైపుణ్యం, భవిత కేంద్రాలు నిర్వహణ, వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నేను మీకు అభయం ఇస్తున్నాను దివ్యాన్గులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి లో దివ్యాన్గులను భాగస్వాములను చేస్తూ చేయూతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధిమాంద్యంతో బాధపడే దివ్యాంగుల సాధికారత కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చవల్ డిసేబులిటీఎస్ (National institute for the empowerment of persons with intellectual disabilities) సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఎన్జీవోల స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ఉద్యోగ మేళా కోసం స్టాల్ ఏర్పాటు చేసింది. అలీం కో, ఐజినిష్డ్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అనంతరం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు పరిశీలించి దివ్యాంగులతో ప్రత్యేకంగా ముఖాముఖీ మాట్లాడారు. అన్ని స్టాళ్లను సందర్శించి, దివ్యాన్గులు వేసిన పెయింటింగ్ కొనుగోలు చేసి నగదు చెల్లించి అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులుప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
డైరెక్టర్ డా. బి.వి. రామ్ కుమార్ దివ్యాంగులకు సౌకర్యాల కల్పన, అవసరమైన సేవల సమన్వయం కోసం ఆయన సూచనలు ఇచ్చారు. కాగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్లా రామకృష్ణ సారధ్యంలో మానసిక దివ్యాంగులకు సుమారు 600 మందికి భోజన సౌకర్యం కల్పించారు.