నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి షెడ్యూల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగ్గా, 14న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో కీలక కూటములైన ఎన్డీఏ (NDA), ఇండియా (India) లు సీట్ల పంపకంపై దృష్టి సారించాయి. అయితే బిహార్లోని ఎన్డీయే కూటమిలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), బీజేపీ, హెచ్ఏఎం, ఎల్జేపీ (రామ్ విలాస్), ఆర్ఎల్ఎం పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. కూటమి ఏర్పడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై
కూటమిలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.
కూటమిలోని హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీలు సీట్ల పంపకంపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. సీట్ షేరింగ్పై ఎన్డీయే నాయకులు శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే మిత్రపక్షమైన హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ ప్రతిపాదించిన సీట్ల పంపకం ప్రతిపాదనను తిరస్కరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆదివారం సీట్ల కేటాయింపుపై ప్రకటన చేస్తామని బీజేపీ తెలిపింది. ఎన్డీఏలో చర్చలు విఫలమైతే, మాంఝీ స్వతంత్రంగా 15 నుంచి 20 సీట్లకు పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఎన్డీయేకు షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్డీయేలో మరో భాగస్వామ్య పార్టీ అయిన ఎల్జేపీ సైతం సీట్ల పంపకంపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. గతంలో 20 నుంచి 22 సీట్లకు ఓకే చెప్పిన ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం 25 సీట్లు కావాలని పట్టుబట్టారు. అయితే ఆయన పార్టీలోని మరికొందరు నేతలు ఏకంగా 40 సీట్లు అడుగుతున్నట్టు సమాచారం. దీంతో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం జటిలంగా మారింది. నేడు మరోసారి ఎన్డీయే నేతలు సమావేశమై దీనిపై చర్చించనున్నారు.