Thursday, December 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే సామేల్‌ ప్రకటించిన సర్పంచ్‌ పేర్లపై అసంతృప్తి

ఎమ్మెల్యే సామేల్‌ ప్రకటించిన సర్పంచ్‌ పేర్లపై అసంతృప్తి

- Advertisement -

మండల అధ్యక్షుని సస్పెన్షన్‌పై వివాదం
ప్రజాప్రతినిధి సస్పెన్షన్‌ చెల్లదని జిల్లా అధ్యక్షుని ప్రకటన
పీసీసీ జోక్యానికి నివేదిక


నవతెలంగాణ-సూర్యాపేట
స్థానిక సంస్థల ఎన్నికలు వేళ కాంగ్రెస్‌ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ క్యాడర్‌లో గ్రూపుపోరు మళ్లీ భగ్గుమంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌-మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డి అనుచర గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలు అభ్యర్థుల ఎంపిక దశలోనే ఉత్కంఠ రేపుతున్నాయి. జాజిరెడ్డిగూడెంలో అభ్యర్థుల ప్రకటన వివాదం సస్పెన్షన్‌ వరకు వెళ్లింది. ప్రజాప్రతినిధి చేసిన సస్పెన్షన్‌ చెల్లదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య స్పష్టం చేయడంతో గ్రూపుపోరు మరింత ముదిరింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్‌, మద్దిరాల మండలాల్లో ఉన్న 104 గ్రామపంచాయతీల నామినేషన్ల వ్యవహారంలో ఎవరికి వారే నిర్ణయాలు తీసుకున్నారు.

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి) మండలంలో కాసర్లపహాడ్‌ గ్రామానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యే మందుల సామేల్‌ను కలవడంతో ఆయన మంచాల కళమ్మను సర్పంచ్‌ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సమాచారం బయటకు రావడంతో దామోదర్‌ రెడ్డి గ్రూపు అలర్ట్‌ అయింది. వెంటనే జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు మోరపాక సత్యం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి 16 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అయితే, నామినేషన్‌ పరిశీలన పూర్తికాక ముందే మండలంలోని సర్పంచ్‌ అభ్యర్థుల జాబితాను అనధికారికంగా ప్రకటించారని ఆరోపిస్తూ, మండల అధ్యక్షులు మోరపాక సత్యంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎమ్మెల్యే సామేల్‌ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సస్పెన్షన్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య స్పందించారు. మండల అధ్యక్షుడిని సస్పెండ్‌ చేసే అధికారం పీసీసీ అధ్యక్షుడికి మాత్రమే ఉందని, ప్రజా ప్రతినిధులు తీసుకునే సస్పెన్షన్‌ నిర్ణయాలు చెల్లవని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిణామాలను పీసీసీ అధ్యక్షుడికి నివేదించామన్నారు.

సామేల్‌ అందరినీ పిలిచి మాట్లాడాలి : ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
స్థానికంగా బలం లేని వారు నిలబడితే ఓడిపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎమ్మెల్యే సామేల్‌ అందరినీ పిలిచి మాట్లాడటంతోపాటు ప్రజాదరణ పొందిన వారిని నిలబెట్టుకోవాలని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -