నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం తెల్లవారు జాము నుంచి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాలలో తనిఖీలు చేపట్టారు. ఇటివల కాలంలో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో చాలమటుకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఆస్తులు తనఖా పెట్టి( సెల్ రిజిస్ట్రేషన్) లు చేసుకుని, అధిక వడ్డీలు వసూలు, లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు అదేశించారు.
జిల్లా లో ఏకకాలంలో పది టీంలతో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ డివిజన్ లో పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. సంబందిత ఎసిపీల పర్యవేక్షణలో సిఐలు, ఎస్ఐల అధ్వర్యంలో వడ్డీ వ్యాపారుల దందాల వివరాలను, లావా దేవిల చిట్టాలను పరిశీలించారు. సంబంధిత వివరాలు సిపి కి అందచేయనున్నారు అధికారులు. సీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు, చర్యలకు అవకాశం ఉంది.