నవతెలంగాణ-హైదరాబాద్: దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. ఐదు రోజలుగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. వికాస్పురి ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ 238గా నమోదైంది. దీంతో వికాస్పురి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.అలాగే అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదు అయ్యింది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది.
ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయులను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్లు తెలిపారు.
రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో తొమ్మిది ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరిలోకి వచ్చినట్లు తెలిపారు. ఆనంద్ విహార్లో (389), వజీర్పూర్ (351), జహంగీర్పురి (310), ద్వారక (310) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. చలిమంటలు, బాణాసంచా పేలుళ్లతో రానున్న రోజుల్లో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.