నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ సూచన మేరకు కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు.. 16 ప్రతిపక్ష పార్టీలు పలు మార్లు కోరినా ప్రత్యేక సెషన్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కేంద్రాన్ని శివసేన (యూబీటీ) పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రత్యేక సెషన్ కావాలంటే ట్రంప్ వద్దకు వెళ్లాలా అని మోడీని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ వేళ దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేడు దేశ రాజధాని దిల్లీలో ఇండియా బ్లాక్లోని కీలక పార్టీల నాయకులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎంపీలు వినతి పత్రంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రియాన్, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, శివసేన యూబీటీ నుంచి సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు.
ఎన్సీపీ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్, సీపీఐ, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఐ (ఎంఎల్) తదితర పార్టీలు కూడా లేఖపై సంతకాలు చేశాయి. ఇక డీఎంకే లేఖపై సంతకం చేసినా..కరుణానిధి జయంతి సందర్భంగా సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ప్రత్యేకంగా ప్రధానికి వేరే లేఖ పంపుతోంది. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ఎటువంటి డిమాండ్ రాలేదు.