కాకినాడ : కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారులో విద్యుదాఘాతానికి గురై వరి డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. జగ్గంపేట పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు… పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపట్టి సింహాద్రి అప్పన్న (57), వరి కోత యంత్రం డ్రైవర్గా, రాపాక గ్రామానికి చెందిన గెడ్డం సందీప్ (22) క్లీనర్గా పనిచేస్తున్నారు. వరి కోతల్లో భాగంగా వారు రాజానగరం మండలం కలవచర్ల వచ్చారు. అక్కడ పని పూర్తయిన తర్వాత సింగవరం బయలుదేరారు. వరి కోత యంత్రాన్ని తమ సొంత వ్యాన్పై ఎక్కించి వెళ్తున్నారు. రామయ్యపాలెం శివారుకు చేరుకున్న సమయంలో వ్యాన్పై ఉన్న వరి కోత యంత్రానికి 11 కెవి విద్యుత్ వైరు తగిలింది. దీంతో, విద్యుదాఘాతానికి గురై వ్యాన్ను డ్రైవర్ చేస్తున్న సింహాద్రి అప్పన్న, క్లీనర్ సందీప్ అక్కడిక్కడే మృతి చెందారు. 11 కెవి విద్యుత్ వైరు కిందకు ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. జగ్గంపేట సిఐ వైఆర్కె.శ్రీనివాస్, ఎస్ఐ శివనాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారి కిరణ్ను స్థానికులు నిలదీశారు. వెంటనే విద్యుత్ వైర్లు పైకి ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.



