భారతసైన్యం ఏర్పాట్లు
న్యూఢిల్లీ : భారత సైన్యం తన అన్ని విభాగల్లోనూ డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను వేగంగా అనుసంధానిస్తోంది. కాబట్టి ప్రతీ సైనికుడికి తన విభాగానికి ఏర్పాటు చేసే డ్రోన్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన శిక్షణ పొందాలని సైన్యం భావిస్తోంది. నిఘా, పోరాటం, లాజిస్టిక్స్, వైద్య సహాయం వంటి డ్రోన్ల నిర్వహణపై శిక్షణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘ప్రతీ సైనికుడు ఆయుధాన్ని కలిగి ఉన్నట్లే ప్రతీ సైనికుడు డ్రోన్ను ఆపరేట్ చేయగలగాలి’ అని ఒక సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. దీన్ని ఆధునిక, సాంకేతికత ఆధారిత సైన్యం వైపు నడిపించే అడుగుగా అధికారి అభివర్ణించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుణాచల్ప్రదేశ్లోని లికాబలిలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రోన్ శిక్షణ- ప్రయోగ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. డ్రోన్ వంటి మానవరహిత వ్యవస్థలను సైన్యం ముందువరస కార్యకలాపాల్లో అనుసంధానించడం ప్రాముఖ్యతను వెల్లడించడమే ఈ పర్యటన ఉద్దేశ్యం.
అరుణాచల్ప్రదేశ్లోని ఈ కేంద్రంతో పాటు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, మోవ్లోని ఇన్ఫ్రాంటీ స్కూల్, చెన్నైలోని ఆఫీసర్స ట్రైనింగ్ అకాడమీ వంటి కీలక శిక్షణా అకాడమీల్లోనూ డ్రోన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇప్పటికే డ్రోన్లను యుద్ధభూమిలో ప్రధాన నైపుణ్యంగా వినియోగించడంలో సైనికులకు శిక్షణ ఇచ్చే కోర్సులను నిర్వహిస్తున్నారు. సైన్యంలో డ్రోన్ల వినియోగం గురించి ఈ ఏడాది జులై 26న ద్రాస్లో నిర్వహించిన 26వ కార్గిల్ విజరు దివాస్ వేడుకలో ఆర్మీ చీఫ్ వివరించారు. సైన్యం అన్ని విభాగాల్లోనూ డ్రోన్ సేవలు పెరుగుతాయని తెలిపారు.