సమర్థులైన పోలీస్ అధికారులతో డ్రగ్స్ సరఫరా అరికట్టాలి : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాతబస్తీలో ఎంఐఎం అండదండలతో డ్రగ్స్ముఠా చెలరేగిపోతున్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆ ముఠాలకు మైనర్ పిల్లలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, గోషామహల్ బీజేపీ అధ్యక్షులు ఉమా మహేందర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు జి.మనోహర్రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్, లైంగికదాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ద ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర బలగాలను పాతబస్తీలో మోహరించాల్సి వస్తుందన్నారు. పాతబస్తీలో జరుగుతున్న ఘటనలు కేరళ ఫైల్స్ సినిమాను తలపిస్తున్నాయన్నారు. ఆ డ్రగ్స్ గ్యాంగ్ను పట్టుకునే దమ్ము లేదా? అని సీఎంను ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేస్తానన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.



