Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'స్మోక్‌' సిటీ

‘స్మోక్‌’ సిటీ

- Advertisement -

– కరీం’నగరాన్ని’ కమ్మేస్తున్న డంప్‌యార్డ్‌ పొగ
– ముందుకు సాగని బయోమైనింగ్‌..
– దిగజారిన గాలి నాణ్యతపై ఏక్యూఐ నివేదిక
– ‘డంప్‌యార్డ్‌ హటావో.. హమ్‌కో బచావో’ అంటూ రోడ్డెక్కుతున్న జనం
– పట్టించుకోని కేంద్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, అధికార కాంగ్రెస్‌..
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ.. ఇప్పుడు ‘స్మోక్‌’ సిటీగా మారింది. నగ రాన్ని ఆను కునే ఉన్న డంప్‌యార్డులో ఎండలకు నిత్యం మంట లు చెలరేగి వస్తున్న దట్టమైన పొగ చుట్టుపక్కల ఐదారు డివిజన్లను కమ్మే స్తోంది. ఊపిరి తీసుకునేందుకూ వీలుల కుండా కాలనీలను కమ్మేస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయో మైనింగ్‌తో డంప్‌యార్డును తొలగిస్తామన్న ప్రక్రియ ఆదిలోనే ఆగిపోగా.. దాన్ని తొలగిస్తామన్న పాలకుల మాట నీటి మూటే అయింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజరు ఉన్నారు. ఆయనే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఏనాడూ దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారు, కేంద్ర మంత్రి సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేసుకునుడు తప్ప ఆ డంప్‌యార్డ్‌ తొలగింపునకు తీసుకున్న చర్యలు శూన్యం. మరోవైపు కరీం’నగరం’లోని ప్రజలు ప్రతిరోజూ రెండు సిగరెట్లు కాల్చినంత పొగ కాలుష్యాన్ని పీల్చుతున్నారని ఏఐక్యూ (ఏయిర్‌ క్వాలిటీ ఇన్‌డెస్క్‌) సూచికలు చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరీంనగరంలోని 60 డివిజన్ల నుంచి దాదాపు 90వేల ఇండ్ల నుంచే కాకుండా హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నిత్యం 120 మెట్రిక్‌టన్నుల చెత్త ఈ డంపింగ్‌ యార్డుకు చేరుతోంది. ఇలా 50ఏండ్లుగా పేరుకుపోయిన ఈ డంప్‌యార్డు ఓ పర్వతంగా మారిపోయింది. నిజానికి ఈ డంప్‌యార్డు సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం రూ.16కోట్లతో బయోమైనింగ్‌ను ప్రారంభిం చింది. అయితే, అది ఆదిలోనే నిలిచిపోయింది. అంతటి చెత్తను నిర్ధిష్ట సమయంలో తీసివేయడం ప్రాక్టికల్‌గా కుదర కపోవడంతోనే ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. మరోవైపు డంప్‌ యార్డును ఆనుకునే మానేరు నదిలో రివర్‌ఫ్రంట్‌ పనులు సైతం నిలిచి పోయాయి. రూ.440కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిలిచిపోవడంతో డంప్‌యార్డ్‌ తొలగింపు అంశమూ అటకెక్కింది.
పనులకు వెళ్లలేక.. షాపులు తెరవలేక..
డంప్‌యార్డ్‌ తగలబడుతూ వెలువడుతున్న దట్టమైన పొగకు సమీపంలోని ఆటోనగర్‌లో షాపులు తెరవలేకపోతున్నారు. తెరిచినా కార్మికులకు పనులకు వచ్చేందుకు జంకుతున్నారు. దాదాపు 200కుపైగా షాపులు ఉన్న ఈ ప్రాంతంలో ఆ పొగ పీల్చడంతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఆటోనగర్‌ ప్రజలేగాకుండా అల్గునూర్‌, కోతిరాంపూర్‌, కట్టరాంపూర్‌, అల్కాపురికాలనీ, హనుమాన్‌నగర్‌, గాయత్రినగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ సహా డంప్‌యార్డు నుంచి సుమారు 3కిలోమీటర్ల మేర నిత్యం పొగ అలుముకుంటోంది. అల్గునూర్‌ నుంచి కోతిరాంపూర్‌, హౌజింగ్‌బోర్డుకాలనీ వరకు పొగతో దారి కనిపించక ఆ దారిలో వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఆందోళన బాట
పొగను అరికట్టే విషయంలో నగరపాలక సంస్థ అధికారులుగానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ‘ఉపశమన హామీలే’ తప్ప ఏనాడూ ఆచరణలో పెట్టకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలంతా జేఏసీగా ఏర్పడ్డారు. డంప్‌యార్డ్‌ బాధితుల సంఘం పేరిట వాట్సప్‌ గ్రూపు ద్వారా ప్రజలంతా ఏకమై వారం రోజులుగా ఆందోళన బాటపట్టారు. నాలుగు రోజుల కిందట ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి కోతిరాంపూర్‌ వరకు ర్యాలీ తీశారు. రెండ్రోజుల కిందట కోతిరాంపూర్‌ నుంచి డంప్‌యార్డు వరకూ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ‘ప్రజవాణి’లో నిలదీశారు. అధికారులు, పాలకుల మాటలకు విసిగివేసారిన డంప్‌యార్డు బాధిత ప్రజలు ప్రతిరోజూ నిరసన పర్వాన్ని కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
మమ్మల్ని ఈ పొగలోనే ఉండమంటారా?
మా పిల్లలు బయట ఆడలేరు.. ఇంట్లోనూ పొగ దుర్గంధం. రాత్రిళ్లు ఊపిరి తీసుకోవడానికి వృద్ధులు సహా అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం హామీలు ఇస్తుంది కానీ, ఏం చేస్తుంది? మమ్మల్ని ఈ పొగలోనే ఉండమంటుందా?..
బొద్దుల జగదీశ్‌, వరసిద్ధినగర్‌, కోతిరాంపూర్‌

రోగాలపాలవుతున్నాం
పొగ వల్ల ఇప్పటికే చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. శ్వాసకోశ సమస్యలతో డాక్టర్‌ దగ్గరకు వెళ్తే డబ్బులు ఖర్చు. ఈ డంప్‌యార్డ్‌ను తీసేయమని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– నారెడ్డి గుణేందర్‌రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు

డంప్‌యార్డుపై ప్రత్యేక దృష్టి
డంపు యార్డుకు చెత్తను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం సిగ్రిగేషన్‌ ప్రక్రియ ద్వారా తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారీ, పొడి చెత్తను డీఆర్‌ సీసీలలో రిసైక్లింగ్‌ ప్రక్రియ చేపడుతున్నాం. డంపు యార్డులో బయోమైనింగ్‌ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నాం. త్వరలో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంటు, బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నాం.
– చాహాత్‌ బాజ్‌ పారు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -