Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవృత్తిలో నైపుణ్యానికి డ్యూటీమీట్లు దోహదం

వృత్తిలో నైపుణ్యానికి డ్యూటీమీట్లు దోహదం

- Advertisement -

– తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్ట్‌
– జాతీయస్థాయిలో మరిన్ని పతకాలను సాధించాలి: అడిషనల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

పోలీస్‌ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు పోలీస్‌ డ్యూటీమీట్లు దోహదపడతాయని తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్ట్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పీటీసీ మామూనూర్‌ వేదికగా గురువారం ఏర్పాటు చేసిన రెండవ తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను అడిషనల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో రాష్ట్రంలో ఏడు జోన్లతో పాటు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్లు, సీఐడీ ఇంటెలిజెన్స్‌, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌, జీఆర్‌పీ, ఐటీఅండ్‌టీ, అక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ విభాగాలకు చెందిన సుమారు నాలుగు వందలకుపైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది సైటిఫిక్‌ ఎయిడ్‌, యాంటీ సబటేజ్‌ చెక్‌, కంప్యూటర్‌, డాగ్‌ స్వ్కాడ్‌, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీపడనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన ఉత్తేజంతో ఈ పోటీల్లో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. దేశంలో నేర దర్యాప్తుతో పాటు అన్ని విభాగాల్లో తెలంగాణ మొదటి, రెండు స్థానాల్లో నిలవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. మీరందరూ కష్టపడి పని చేయడం ద్వారా మనకు ఈ కీర్తి ప్రతిష్టలు వచ్చాయని, అలాగే జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్‌లో చక్కటి ప్రతిభ కనబరిచి అన్ని విభాగాల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అడిషనల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. వరంగల్‌లో పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహిం చడం ఇది రెండోసారని, 2008లో ఇక్కడ డ్యూటీ నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసులు 18 పతకాలు సాధించిన తొలి రాష్ట్ర పోలీస్‌గా తెలంగాణ ఘనత సాధించిందని, ఇదే రీతిలో త్వరలో జరిగే జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలను సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహణపై వివరించారు. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్‌, ఎస్పీ రాంరెడ్డి, డీసీపీలు అంకిత్‌కుమార్‌, షేక్‌ సలీమా, రాజమహేంద్రనాయక్‌, పీటీసీ ప్రిన్స్‌పాల్‌ పూజ, కమాండెంట్లు రాంకుమార్‌, రామకృష్ణ ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -