నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పోలింగ్ కేంద్రాల వద్ద పచ్చని మొక్కలు, పూలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఓటర్లను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే ఆలేరు , ఆత్మకూరు, బొమ్మలరామారం, రాజాపేట , తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలల్లో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆలేరు మండలం శారాజిపేట ఆత్మకూరు మండలం సర్వేపల్లి , బొమ్మల రామారం మండలం పక్కిరుగూడెం,రాజాపేట మండలం నర్సాపూర్, యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా పోలింగ్ కేంద్రంలో ప్లాస్టిక్స్ రహిత వస్తువులను ఉపయోగించడం , పోలింగ్ కేంద్రం ఎంట్రెన్స్ లో పూలతో అలంకరణ,బయట నుండి బూత్ వరకు పచ్చని మొక్కలు , కొబ్బరి మట్టలతో అలంకరణ ఏర్పాటు చేయడం. వృద్ధులకి, దివ్యాంగులకు వీల్ ఛైర్ సౌకర్యం కల్పించడం. చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయడం, లంచ్ సమయంలో ప్లాస్టిక్ ప్లేట్ కి కాకుండా అరటి ఆకులు లేదా ఎండు విస్తరాకులు వాడాలని చెప్పడం జరిగింది అని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ చెప్పారు .
గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రం లో భాగంగా ఆలేరు మండలం శారాజీ పేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చే ఓటర్లకి పూల మొక్కలతో స్వాగతం పలకాలని సూచించారు. ఓటర్ ల పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు.



