– పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలి- డాక్టర్ గంగాధరయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధరయ్య అన్నారు. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.శుక్రవారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతున్న తీరును మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన టీకా మందును ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, నోటిలో పుల్లతో చొంగ కారడం, చూడి పశువులు అబార్షన్లు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని సూచించారు. రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం పలు పశువులకు స్వయంగా ఆయన టీకాలు వేశారు. గ్రామంలోని 65 గోజాతి, 369 గేదే జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు తెలిపారు.కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.