నవతెలంగాణ-హైదరాబాద్: గత కొన్నిరోజులుగా పంజాబ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదల వల్ల పంజాబ్లోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను సెప్టెంబర్ 7 వరకు మూసివేయాలని పంజాబ్ విద్యాశాఖా మంత్రి హర్జోత్సింగ్ బైన్స్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్లలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నందున నేడు ఈ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక హర్యానాలో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. ఆ రాష్ట్రంలోని కర్నాల్, సోనిపట్, యమునానగర్, పంచకుల, చండీగఢ్, అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, పానిపట్, మేవాట్, రెవారీలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున చండీగఢ్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక జమ్మూలో కొన్ని జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 14-16 గంటల్లో జమ్ము, కథువా, రియాసి, రాజౌరి, రాంబన్ జిల్లాల్లో క్లౌడ్బరస్ట్ వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్రానికి ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.