అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన విద్యా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్
నవతెలంగాణ- అచ్చంపేట
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ అచ్చంపేటలో విజయవంతంగా జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధుల పైన విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బంద్ కు సహకరించిన ఇంటర్, డీగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ప్రవీణ్, శివ, తరుణ్, విజయ్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



