నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. బుధవారం రోజు మినీ మీటింగ్ హల్ లో అన్ని శాఖల అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల పైవివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఆయా శాఖల వారీగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, వి ఐపిలు, అధికారులకు, ఇతరులకు అనుకూలంగా సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి , హ్యాండ్లూమ్, మత్స్యశాఖ, హార్టికల్చర్, మెప్మా, వైద్య, శిశు సంక్షేమ, సంక్షేమ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి, హార్టికల్చర్ అగ్రికల్చర్, అటవీ, విద్య, ఆర్టీసీ సివిల్ సప్లై ఎలక్ట్రిసిటీ హౌసింగ్ శాఖలు శకటాల ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ ,భువనగిరి ఆర్డిఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.