Thursday, June 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహరీశ్‌రావుపై ఎన్నికల పిటిషన్‌ కొట్టివేత

హరీశ్‌రావుపై ఎన్నికల పిటిషన్‌ కొట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత టి.హరీశ్‌రావు ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత జి.చక్రధర్‌గౌడ్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆరోపణలకు సరైన ఆధారాలు చూపలేదని పేర్కొంది. జస్టిస్‌ కాజా శరత్‌ ఈ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి మంగళవారం తీర్పు వెల్లడించారు. గతేడాది జనవరి 10న బీఎస్పీ నుంచి పోటీ చేసిన చక్రధర్‌ గౌడ్‌(ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు వినతి పత్రం మాత్రం సెప్టెంబరు 30న సమర్పించారు. ఈపీ వేశాకే ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని జస్టిస్‌ తప్పుపట్టారు. ఈసీకి అందజేసిన వినతిపత్రం ప్రతిని హైకోర్టుకు ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకు 45 శాతమే పోలింగ్‌ ఉంటే దానిని హరీష్‌ తన అనుచరుల ద్వారా 85 శాతం పెరిగేలా చేశారనే ఆరోపణలకు ఆధారాలైన గంటలవారీ పోలింగ్‌ వివరాలు సమర్పించలేదన్నారు. మిట్టపల్లి రెవిన్యూ గ్రామంలో సర్వే నెం 1037లోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా చూపి తప్పుదారి పట్టించారంటూ ధరణి పోర్టల్లోని వివరాలకుా ద్రువీకరణ లేకుండా ఆరోపణ చేశారన్నారు. సర్వే నెం 1037లో 1431 చదరపు గజాలు. 520 చదరపు గజాలు వేర్వేరుగా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లను హరీశ్‌ ఇచ్చారని తెలిపారు. క్రిమినల్‌ కేసుల వివరాలను హరీశ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారనీ, కేసులతోపాటు శిక్ష పడిన కేసుల వివరాలను కూడా ఇచ్చారని తెలిపారు. పిటిషనర్‌ ఆరోపణలకు ఆధారాలను సమర్పించలేదని తీర్పు చెప్పారు.
గోపీనాథ్‌పై ఎన్నికల పిటిషన్‌ మూసివేత
జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన రెండు ఎన్నికల పిటిషన్లపై హైకోర్టు విచారణ మూసివేసింది. ఈవీఎంలో అవకతవకలు జరిగినందున మాగంటి గోపీనాథ్‌ ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌, ఓటరు వి.నవీనీయాదవ్‌ వేసిన పిటిషన్లను కొట్టేస్తూ మంగళవారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాగంటి మరణించడంతో పిటిషన్లపై విచారణ అవసరం లేదన్నారు
జస్టిస్‌ గిరిజా ప్రియదర్శినికి నివాళులు
అనారోగ్యంతో ఇటీవల మరణించిన హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాటూరి గిరిజా ప్రియదర్శినికి హైకోర్టు మంగళవారం నివాళి అర్పించింది. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజరు పాల్‌ అధ్యక్షతన ఫస్ట్‌ కోర్టు హాల్లో సంతాప సమావేశం జరిగింది. మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.కార్యక్రమంలో జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని కుటుంబ సభ్యులతోపాటు, ఏజీ సుదర ్మన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ శర్మ. డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జగన్‌ హాజరయ్యారు. బార్‌ అసోసియేషన్‌ కూడా సంతాప సమావేశం నిర్వహించింది.
గాలికి శిక్ష సస్పెన్షన్‌పై నేడు ఉత్తర్వులు
ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ గాలి జనార్ధన్‌రెడ్డి (కర్నాటక ఎమ్మెల్యే) దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్టు వెల్లడించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, అలీఖాన్‌ దోషులని తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల ఆరోతేదీన ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును వారితోపాటు ఓఎంసీ కంపెనీ కూడా సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీళ్లను దాఖలు చేశారు. శిక్ష అమలు జరిగితే తనపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేశారనీ, నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుందని గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓఎంసీ డైరెక్టర్లు ఇద్దరూ జైలులో ఉంటే కంపెనీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఓఎంసీ దాఖలు చేసిన అప్లికేషన్‌లో పేర్కొంది. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం పూర్తి చేశారు. ఐఏలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించారు. ఇదే కేసులో ప్రధాన పిటిషన్‌ విచారణ ఆగస్టు 11కు, మరికొన్ని అప్లికేషన్లపై విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -