Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

మావోయిస్టు అగ్రనేత సహదేవ్‌ సహా మరో ఇద్దరు మృతి
సహదేవ్‌పై రూ. కోటి రివార్డు


హజారీబాగ్‌ : జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా గోర్హార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాటి పిరి అడవిప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, రూ. కోటి రివార్డు ఉన్న సహదేవ్‌ సోరెన్‌ అలియాస్‌ పర్వేష్‌ ఉన్నారు. బీహార్‌-జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు, రూ.25 లక్షల రివార్డు ఉన్న రఘునాథ్‌ హెంబ్రామ్‌ , ప్రాంతీయ కమిటీ సభ్యుడు , రూ 10 లక్షల రివార్డు ఉన్న బిర్సెన్‌ గంజు అలియాస్‌ రాంఖేలావన్‌ సైతం ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 వంటి ప్రాణాంతక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.209 కోబ్రా బెటాలియన్‌, హజారీబాగ్‌ పోలీసుల సంయుక్త బృందం జత కలిసి ఈ ఆపరేషన్‌ నిర్వహించాయి.

ఎదురుకాల్పుల తర్వాత.. పరిసరాల్లో మిగతా మావోయిస్టులను వెతకడానికి వీలుగా మొత్తం ప్రాంతంలో ఇంటెన్సివ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్‌ విజయవంతమైందని హజారీబాగ్‌ ఎస్పీ అంజని అంజన్‌ ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 244 మంది మావోయిస్టులు మృతి ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 244 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 215 మంది బస్తర్‌ డివిజన్‌లో (ఇందులో ఏడు జిల్లాలు ఉన్నాయి) మరణించగా, మరో 27 మంది రారుపూర్‌ డివిజన్‌లోని గరియాబంద్‌ జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. దుర్గ్‌ డివిజన్‌లోని మోహ్లా-మన్‌పూర్‌-అంబగఢ్‌ చౌకి జిల్లాలో మరో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.ఇటీవల గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత సీపీఐ(ఎంఎల్‌) (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టు అగ్రనేతలను హతమార్చారు. వీరిపై మొత్తం రూ.5.25 కోట్ల రివార్డు ఉన్నట్టు భద్రతాబలగాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -