యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025 హైదరాబాద్లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ‘యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో ఈ స్థాయి ఫెస్టివల్ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకంగా ఉంది’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కె.వి.రావు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, అలియన్స్ ప్రాంజైజ్ డైరెక్టర్ మౌద్ మీక్వావు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఇయు డెలిగేషన్ సెకండ్ సెక్రటరీ లోరెంజో పర్రుల్లి మాట్లాడుతూ,’గత ఏడాది హైదరాబాద్లో ఫెస్టివల్కు వచ్చిన సానుకూల స్పందన మమ్మల్ని మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసింది. ఈసారి 23 యూరోపియన్ సినిమాలను ప్రదర్శిస్తున్నాం. కథల పట్ల, చిత్రసృష్టి పట్ల హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రేమ ప్రత్యేకం. ఇండో-యూరోపియన్ సాంస్కృతిక సంభాషణను మరింతగా బలోపేతం చేయడం మా ముఖ్య లక్ష్యం’ అని తెలిపారు. ఫెస్టివల్ నిర్వాహకులు మాట్లాడుతూ, ‘హైదరాబాద్ గడ్డ సినీ ప్రేమికుల అడ్డా” అని పేర్కొన్నారు. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో విజయవంతంగా ముగిసిన ఇయుఎఫ్ఎఫ్ 30వ ఎడిషన్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈనెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్లోని మూడు వేదికల్లో ప్రదర్శనలు జరుగనున్నాయి. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, శ్రీ సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్, హైదరాబాద్లో సినీ ప్రేమికులు సినిమాలను వీక్షించవచ్చు’ అని అన్నారు.
ఘనంగా యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



