నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షులు ట్రంప్ వాదన రజతోత్సవానికి చేరుకున్నప్పటికీ, ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. గత 73రోజుల్లో ట్రంప్ 25సార్లు బాకా ఉదారు కానీ ప్రధాని మౌనంగానే ఉన్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ప్రధానికి విదేశాలకు వెళ్లేందుకు, స్వదేశంలో ప్రజాస్వామ్య సంస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం దొరుకుతుందని ఎద్దేవా చేశారు. భారత్, పాక్ల మధ్య ఇటీవల జరిగిన యుద్ధాన్ని తాను ఆపానని, ఈ యుద్ధంలో ఐదు విమానాలను కూల్చివేశామని ట్రంప్ మంగళవారం మరోసారి వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ల మధ్య వివాదం బహుశా అణు యుద్ధంతో ముగిసి ఉండేదని కూడా అన్నారు.
పార్లమెంట్లో పెహల్గాం-సిందూర్పై చర్చకు కచ్చితమైన తేదీలు ప్రకటించేందుకు ప్రధాని మోడీ నిరాకరిస్తూనే ఉన్నారు. చర్చలో ప్రధాని సమాధానానికి కట్టుబడి ఉండటానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తూనే ఉండటంతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ రజతోత్సవానికి చేరుకున్నారని, ఇది ఆయన వాదనలకు పావు శతాబ్దపు మార్క్ అని అన్నారు.
ఈ ఏడాది మే 10న, వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని సోషల్ మీడియాలో ప్రకటించినప్పటి నుండి, భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తాను సహాయం చేశారని ఆయన అనేక సందర్భాల్లో తన వాదనను పునరావృతం చేశారు.