తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భూభారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రైతు సమస్యను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ కారణాల చేత భూభారతి గ్రామ సదస్సులో పాల్గొనక దరఖాస్తు చేసుకొని వారికి కూడా దరఖాస్తును పెట్టుకోవడానికి మరో మారు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండలం రాయగిరి రెవెన్యూ పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి, వడాయి గూడెం, జమ్మాపురం, రాయగిరి గ్రామాలకు సంబంధించిన భూభారతి సదస్సు రాయగిరిలో నిర్వహించగా రైతులకు సంబంధించిన వివిధ సమస్యలపైన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి తాసిల్దార్ కు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ గత 50, 60 సంవత్సరాలుగా అనేకమంది దళితులు, గిరిజనులు, పేదలు ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున సాగు చేసుకుంటున్నారని, ఆ భూముల ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కానీ కొందరికి పట్టాలు ఇచ్చారని, కొందరికి నేటికీ ఇవ్వలేదని తెలిపారు. చాలా గ్రామాలను ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబంలోని పెద్ద వారి పేరుతో పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చారని కానీ నేడు ఆ కుటుంబాలు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది విభజన జరిగాయని భూమి అందరు చేసుకుంటూ బతుకుతున్నారు తప్ప ఒకరి పేరు మీదనే భూమి ఉండడం వారికే పట్టాదారు పాస్బుక్ ఉండడంవల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం భూమి సేద్యం చేసుకుంటున్న వారందరికీ పట్టా సర్టిఫికెట్లు, నూతన పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భువనగిరి మండలంలో భూ పంపిణీ నిషేధం పేరుతో సేద్యం చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు కూడా పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టం పేరుతో పేదలను అనేటి ఇబ్బందులు పెట్టిందని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రభుత్వము భూభారతి చట్టంలో పేదలు ఎదుర్కొంటున్న ప్రతి భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తులను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ఈ సదస్సులలో అసైన్మెంట్ భూముల, డి.ఫారెస్ట్ భూముల, రాచకొండ భూముల, కాంధీ షీకుల భూముల, వక్ భూముల సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కూకుట్ల శ్రీశైలం, కొండమడుగు చంద్రయ్య, గౌరయ్య, కృష్ణ, బాలరాజు, స్వామి, వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సత్తయ్య తో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు.