Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముఖాముఖికి స్పందన

ముఖాముఖికి స్పందన

- Advertisement -

ప్రజలతో మమేకమవుతున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
గోడు వినిపిస్తున్న బాధితులు
పరిష్కారానికి అమాత్యుల ప్రయత్నాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

హస్తం పార్టీ…పరిపాలనకే పరిమితం కాకుండా ప్రజలతో నిత్యం మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా భవన్‌లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే.. గాంధీభవన్‌లోనూ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రజలు తమ బాధలు, కష్టాలు, ఇబ్బందులను చెప్పుకునేందుకు వీలు కల్పిస్తున్నది. ప్రభుత్వానికి, పార్టీకి ప్రజా ప్రతినిధులు అనుసంధానంగా ఉండేందుకు టీపీ సీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రత్యే కంగా ‘ముఖాముఖి’ కార్యాచరణ రూపొందించారు. దీని ఆవశ్యకతను గుర్తించి ప్రజలు నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు గాంధీభవన్‌లో వేదికను ఏర్పాటు చేశారు. సహజంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందస్తు అపాయింట్‌మెంటు ఉన్న వారినే కలుస్తారు. ఆ రూపంలో కాకుండా మిగతా సందర్భాల్లో వారిని కలవాలంటే గగనమే. అందుకు బాధితులు ఎన్నో ప్రయాసలు పడాల్సి ఉంటుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటూ, మంత్రిని కలిసేందుకు హైదరాబాద్‌కు వస్తే ఆ సమయానికి ఆ మినిష్టర్‌ అందుబాటులో ఉంటారో, లేదో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా పరిష్కారం కాని సమస్యల కోసం రాష్ట్ర రాజధానికి రావాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలతోపాటు సామూహికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరెన్నో ఉంటాయి. పదేండ్లు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ కూడా ఉద్దేశపూర్వకంగా పరిష్కరించలేదనే విమర్శలొస్తు ా్నయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ఆ పార్టీ క్యాడర్‌ ఎదురుచూస్తున్నది. తాము ఎదుర్కొంటున్న కష్టాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిష్కారిస్తారనే భావన వారిలో పెరిగింది. వీటన్నింటికీ ఒక పరిష్కార మార్గంగానే కాంగ్రెస్‌ పార్టీ మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు కూడా వచ్చి తమగోడు వినిపిస్తున్నారు.
అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమం జూన్‌4 నుంచి పున:ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రారంభం కాగా జూన్‌ 11న మంత్రి కొండా సురేఖ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భూసమస్యలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రైతుభరోసా, పంట నష్ట పరిహారం… ఇలా ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీని నమ్ముకుని ఉంటున్నాం… కానీ పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు రావడం లేదంటూ వాపోతున్నారు. అంతేకాకుండా సదరన్‌ సర్టిఫికెట్లు, వికలాంగులకు పెన్షన్‌, ట్రైసైకిల్‌ తదితర సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై విజ్ఞప్తులు తీసుకుంటున్న మంత్రులు అక్కడికక్కడే సంబంధిత మంత్రులతోనూ, కలెక్టర్లు, ఎస్సీలు, ఇతర అధికారులతోనూ మాట్లాడుతూ ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతున్నారు. కొంత ఆలస్యమవుతుందనుకుంటే మంత్రులకు లేఖలు పంపిస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందనుకుంటే సీఎంకు లేఖలు రాస్తున్నారు. బుధవారం గాంధీభవన్‌లో మంత్రి కొండా సురేఖ నిర్వహించిన ముఖాముఖిలో అనేక సమస్యలను ప్రజలు విన్నవించారు. ఈ క్రమంలో కేవలం మంత్రులే కాకుండా 33 మంది కార్పొరేషన్‌ చైర్మెన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారానికి రెండుసార్లు అందుబాటులో ఉండాలంటూ పీసీసీ చీఫ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెండు వారాలుగా ఇద్దరు చొప్పున కార్పొరేషన్‌ చైర్మెన్లు గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటున్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానంతరం కొండా సురేఖ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్‌ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ప్రజల నుంచి 109కిపైగా వినతులను స్వీకరించినట్టు తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చాయని తెలిపారు. ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులపై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌కి తరలివస్తున్నారని తెలిపారు. వినతులను పరిశీలించి తగిన పరిష్కారం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -