- వైద్యుల ముసుగులో అబార్షన్లు, ఇన్ఫెర్టిలిటీ సేవలు
- మెడికల్ కౌన్సిల్ దాడుల్లో వెలుగు చూస్తున్న దారుణాలు
- వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు చేస్తున్నా.. ఆగని మెడికల్ మాఫియా
- పలువురు నకిలీ వైద్యులపై కేసులు నమోదు, రిమాండ్కు తరలింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యులు యథేచ్ఛగా వైద్యం చేసేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి అబార్షన్లు, ఇన్ఫెర్టిలిటీ సేవలను సైతం అందించడానికి వెనుకాడటం లేదు. అవసరాలకు మించి హై ఎండ్ యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. దందా మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రులకు అనుమతులివ్వడం, నిబంధనలు అతిక్రమించిన, అనధికారికంగా నడిచే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నా.. నకిలీ వైద్యులు, ఆస్పత్రులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ వైద్య మండలి చేస్తున్న వరుస దాడులతో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.
హై ఎండ్ డ్రగ్స్ వినియోగం..
ఆర్ఎంపీలు, అనధికారిక క్లినిక్లలో మోమోసెఫ్, నెలోజెల్, జెంటా మెడిసిన్ 30 ఎంఎల్ వైల్స్ వంటి హై ఎండ్ యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వినియోగిస్తున్నారు. న్యూరాలజీ స్పెషలిస్టు వైద్యులు, గైనకాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు రాసిన మందులు చిన్న, చిన్న క్లినిక్లలో దర్శనమివ్వడంతో తనిఖీలకు వెళ్లిన వైద్యుల బృందం ఆశ్చర్యానికి గురవుతోంది. ఒక ఇన్ఫెక్షన్లకు ఎంత మొత్తంలో యాంటీ బయోటిక్ డ్రగ్ ఇవ్వాలనేది ఏఎంఎఫ్సీ గైడ్లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే చిన్నపాటి ఇన్పెక్షన్లకు హై ఎండ్ యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. దాంతో కిడ్నీ సమస్యలు వస్తాయి. అధిక మొత్తం లో స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి నశించి, డయాబెటీస్, కెట్రాక్ట్ సమస్యలు వస్తున్నాయి. భవిష్యత్లో ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. కోవిడ్ సమయంలో దాదాపు 10 లక్షల మంది మృతి చెందగా,యాంటీ బయో టిక్స్ అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్లో అంత కంటే ఎక్కువ మరణాలు సంభవించే ప్రమాద ముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే క్రమం లో అర్హత లేని వ్యక్తులకు అమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
మూడు రకాల డ్రగ్స్ వినియోగం
నకిలీ వైద్యులు మూడు రకాల డ్రగ్స్ను అధికంగా వినియోగిస్తున్నారు. నగరంలో అర్హత లేని వైద్యులు, క్లినిక్లపై తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో దాదాపు 200 కేసులు నమోదు చేశారు. ఇటీవల ఉప్పల్లో అర్హత లేని వైద్యుడు ఇచ్చిన మందులు వికటించి జిమ్ ట్రైనర్ చనిపోయాడు. నగరంలో అర్హత లేని వైద్యులు చేసిన చికిత్సలకు చాలా వరకు అమాయకులు బలైపోతున్నారు. నకిలీ వ్యక్తి వైద్యం చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రజలు నిపుణులైన వైద్యులను మాత్రమే సంప్రదించాలని వైద్యులు, తెలంగాణ వైద్య మండలి సూచిస్తోంది. నకిలీ వైద్యులు, అనధికారిక క్లినిక్లపై ఫిర్యాదులను 91543 82727 ఈ నెంబర్కు చేయొచ్చు.
పలువురిపై కేసులు నమోదు
నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య మండలి, విజిలెన్స్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వరుస తనిఖీలతో నకిలీ వైద్యుల బాగోతాలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో 10 మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట, దుండిగల్, సూరారం పరిధిలో 8 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్, శివరాంపల్లి, బాలాపూర్ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నకిలీ వైద్యులు యాంటిబయోటిక్, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ, ప్రెస్క్రిప్షన్స్ రాస్తూ పట్టుబడ్డారు.