నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమ వ్యవహారం ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఓ యువతిని ప్రేమించాడన్న ఆగ్రహంతో ఆమె కుటుంబ సభ్యులే ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రవణ్ సాయి (21) అనే విద్యార్థి మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న శ్రవణ్ సాయి, అమీన్పూర్కు చెందిన ఓ యువతిని గత ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
మంగళవారం శ్రవణ్ ఉంటున్న హాస్టల్కు వెళ్లి, అతడిని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రేమ విషయంపై నిలదీయగా, తాను ఏడాదిగా ఆమెను కలవలేదని శ్రవణ్ చెప్పడంతో మరింత రెచ్చిపోయారు. ఆవేశంతో యువతి తండ్రి, బంధువులు క్రికెట్ బ్యాట్తో శ్రవణ్ తల, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆందోళన చెందిన నిందితులే అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రవణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



