పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు పరశురాం నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులందరికీ రైతు భీమాకు దరఖాస్తులు చేసుకోవాలని పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్ రైతులకు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కొత్తగా భూములు కొనుగోలు చేసి జూన్ 5 నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన 18 నుండి 59 సంవత్సరాలు కలిగి ఉన్న రైతులు రైతు బీమా కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. భూభారతి, సీసీఎల్ ఏ లో నమోదైన రైతులకు అవకాశం ఉందని తెలిపారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండి గతంలో రైతు బీమాకు దరఖాస్తులు చేసుకొని రైతులకు అవకాశం ఉందని తెలిపారు.
గతంలో భీమాకు అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతు బీమాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈనెల 13 తో రైతు బీమా ముగియనుండడంతో పాత వాటిని పునరుద్ధరించడంతోపాటు నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులకు రైతు బీమాకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ఈ నెల 14 నుంచి అమలు కావడంతో వ్యవసాయ శాఖ నూతనంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు.
ఆర్ఓఓఫ్ఆర్ పట్టాదారులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందించే డాటా ఆధారంగా రైతు బీమా కల్పించనున్నారని తెలిపారు. జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల రైతులు రైతు బీమా కోసం చేసుకున్న దరఖాస్తులను ఈనెల 13 వరకు క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈఓలు, ఏవోలు పరిశీలనను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశించారని తెలిపారు. ఈనెల 12 వరకు పాత లబ్ధిదారుల వివరాలను పునరుద్ధరించాలని ఆదేశించారన్నారు.
అర్హులైన రైతులు, కొత్త రైతు బీమా దరఖాస్తుదారులు ఏఈఓ లను సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతు బీమా కోసం అర్హులైన రైతులను గుర్తించి రైతు బీమా పోర్టల్ లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశించింది అన్నారు. 2025-26 సంవత్సరంలో రైతులకు రైతు బీమాను పునరుద్ధరించేందుకు డేటాను ఈనెల 12 వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాలు వయసు కలిగిన రైతులను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. రైతులు రైతు బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరశురామ్ నాయక్ సూచించారు.