నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు.
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోఢి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా నేను సిద్ధమే. భారత్ సిద్ధమే’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
భారత్పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ .. తాజాగా దాన్ని 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రకటించిన పాత 25శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక, కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది.