మధ్యప్రదేశ్లో ముగ్గురు రైతులకు గాయాలు
ఒడిశాలో ఆందోళనలు, రోడ్ల దిగ్బంధం
న్యూఢిల్లీ : ప్రస్తుతం పొలంలో పంట కోసం శ్రమించాల్సిన రైతన్న ఎరువులు అందక అగచాట్లు పడుతున్నాడు. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలుచుంటున్నా.. అవి అందుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నాడు. బిజెపి పాలిత రాష్ట్రాలుసహా దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం మధ్యప్రదేశ్లో ఒక ఎరువుల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తోపులాటల్లో ముగ్గురు రైతులు గాయపడ్డారు. మొరెనా జిల్లా కేంద్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ధాన్యం మార్కెట్ ప్రాంగణంలో ఉన్న ఎరువుల పంపిణీ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి ఉన్నారు. ఉదయం 9:30 గంటలకు కౌంటర్ తెరవడంతో తోపులాట ప్రారంభమైంది. రైతులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు.
ఇందులో ఇద్దరిని వెంటనే డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తోందని, అందువల్లే రైతులు క్యూ లైన్లలో కష్టాలను, లాఠీఛార్జిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ నెల 8న భిండ్లోని వ్రహత్కార్ సహకారి సంస్థ వద్ద, ఈ నెల 2న రేవాలోని కరాహియా మండి వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఎరువుల కొరతతో ఒడిశాలోని గంజాం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు.
దేశవ్యాప్తంగా ఎరువుల కష్టాలు
- Advertisement -
- Advertisement -