నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్లోని జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జైపుర్లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో ఉన్న ట్రామా సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రామా ఐసీయూలో 11, సెమీ ఐసీయూలో 13 మంది చికిత్స పొందుతున్నట్లు ట్రామా సెంటర్ ఇన్చార్జి అనురాగ్ ధకడ్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు.
ఐసీయూలో మంటలు చెలరేగడం, రెండో ఫ్లోర్ మొత్తానికి పొగవ్యాపించడంతో రోగులు, వారి సహాయకులు హాహాకారాలు పెట్టారు. దీంతో దవాఖాన సిబ్బంది కొందరు రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకీ తీసుకువచ్చారు. ఐసీయూ పరికరాలు, రక్త నమూనా టబ్స్, పేషెంట్ల చికిత్సకు సంబంధించిన కేస్ షీట్లు, వివిధ డాక్యుమెంట్లు, ఇతర పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారని రోగుల బంధవులు ఆరోపించారు. ఐసీయూలో మంటలను ఆర్పేందుకు సిలిండర్లు సహా ఎలాంటి పరికరాలు లేవని చెప్పారు