- మైలార్దేవ్పల్లి పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధి టాటానగర్లోని ప్లాస్టింగ్ గోదాంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అత్తాపూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ చందునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టాటానగర్లోని ప్లాస్టిక్ గోదాం నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. గోదాంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటలు కష్టపడి 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూటా.. మరేమయినా కారణాలు ఉన్నాయా అని విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో గోదాం లోపల కార్మికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నివాసాల మధ్యలో ఇలాంటి గోదాంలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.