మహారాష్ట్ర రవాణా మంత్రి బోణీ బేరం
ముంబయి : భారత్లో తొలి టెస్లా కారును మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్ కొనుగోలు చేశారు. ఆయన తన మనవడికి కానుకగా ఇచ్చేందుకు ఈ కారు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ముంబయిలోని బాద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో తన మొదటి షోరూంను టెస్లా గత జులై 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. బోణీ బేరంగా తొలి కారును మహారాష్ట్ర మంత్రియే కొనుగోలు చేయడం గమనార్హం. టెస్లా ‘వై’ మోడల్ విద్యుత్ కారును ఆయన కొనుగోలు చేయగా ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారంనాడు కారు డెలివరీ చేసి ప్రతాప్ నాయక్కు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ దేశంలో తొలి టెస్లా కారును కొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే రాయితీ ఏదీ లేకుండానే పూర్తి మొత్తం చెల్లించి కొనుగోలు చేశాననీ, తన మనవడికి కానుకగా ఇస్తున్నానని ఆయన తెలిపారు. పర్యావరణ హితమైన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ టెస్లా తొలి కారును కొనుగోలు చేసినట్టు తెలిపారు. కాగా భారత్లో 600 బుకింగ్స్ జరిగినట్టు టెస్లా ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతానికి తాము వైఆర్డబ్ల్యూ వెర్షన్, వైఎల్ఆర్ ఆర్డబ్ల్యూడీ (లాంగ్ రేంజ్) అనే రెండు ‘వై’ మోడళ్లను భారత్లో టెస్లా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. వీటి ధరలు రూ.61 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటోంది.
మనవడికి కానుకగా తొలి టెస్లా కారు
- Advertisement -
- Advertisement -