ఉప కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గంపై దృష్టి సారించాలి
ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ కి విజ్ఞప్తి చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – మిరుదొడ్డి
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ లాంటి భారీ ప్రాజెక్టు నిర్మించుకొని, ప్రధాన కాలువలు నిర్మించుకోవడం జరిగిందని, ఉప కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం ద్రుష్టి సారించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని నగరం పరిధిలోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ తో కలిసి ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ప్రాజెక్టు నిర్మించుకున్నా ఉప కాలువలు లేవని, రైతులకు సాగునీటి గోస తీరడం లేదన్నారు.
యాసంగిలో సాగు పెరిగే అవకాశం ఉంది కావున ఉప కాలువలు నిర్మిస్తే యాసంగిలో నీటి సమస్యలు ఉండే అవకాశం లేదన్నారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా,చూడాలని, రవాణా, గోదాం సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు క్వింటాల్ కు రూ : 500 వరకు నష్ట పోతున్నారని, వెంటనే ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిఫై పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష కార్యక్రమం నిర్వహించాలని కోరారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా రోడ్లు దెబ్బతిన్నాయని. వాటిని వెంటనే బాగు చేయాలని కోరారు. కెసిఆర్ హయాంలో పురుడు పోసుకున్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మూలంగా నిరుపేద వధువులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన కితాభిచ్చారు. చెక్కుల కోసం లబ్ధిదారులను గంటల తరబడి వేచి చూసేలా చేయడం సరికాదని వారి కనీసం తాగునీరు కూడా ఇవ్వడం చెక్కుల కోసం లబ్ధిదారులను గంటల తరబడి వేచి చూసేలా చేయడం సరికాదని వారికి కనీసం తాగునీరు కూడా ఇవ్వకపోవడం పద్ధతి కాదని అధికారులను ఆయన హెచ్చరించారు. కార్యక్రమం సందర్బంగా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ కి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు పుష్పగుచ్చాము అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, లబ్ది దారులు పాల్గొన్నారు.