మధ్యాహ్న భోజనం వికటించి 42 మందికి అస్వస్థత
ఆరుగురి పరిస్థితి విషమం
వాటర్, ఫుడ్ శాంపిల్స్ సేకరించిన అధికారులు
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండాలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. గమనించిన టీచర్లు వెంటనే స్థానికులతో కలిసి విద్యార్థులను కొండాపూర్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమించడంతో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. టీచర్లు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో రోజు మాదిరిగానే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. కొద్దిసేపటికే సుమారు 40 మంది వాంతులు చేసుకున్నారు. గమనించిన టీచర్లు వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారిని అబ్జర్వేషన్ అనంతరం ఉదయం ఇండ్లకు పంపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు తెలిపారు రంగారెడ్డి డీఎంహెచ్ఓ లలిత పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. వైద్యుల బృందాన్ని అలర్ట్ చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్ఎంవో విజయ, ఇతర చిన్నపిల్లల డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నామని ఆమె మీడియాకు తెలిపారు. వాటర్, ఫుడ్ శాంపిల్ సేకరించినట్టు చెప్పారు. త్వరలోనే ఘటనకు గల కారణాలను వెల్లడిస్తామన్నారు.
మాదాపూర్ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



