నవతెలంగాణ-హైదరాబాద్: కెన్యా వీధుల్లో బుధవారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఎనిమింది మంది మృతి చెందారు. 400 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కెన్యా జాతీయ మానవ హక్కుల కమిషన్ (కెఎన్సిహెచ్ఆర్) వెల్లడించింది. గతేడాది జూన్ 25న కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రజలపై మరిన్ని ఆర్థికభారాలు మోపే విధంగా బిల్లును తెచ్చారు. ప్రజలపై విపరీతంగా పన్నులు మోపే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసనలకు దిగారు. ఈ నిరసనల్లో 39 మంది మృతి చెందారు. 360 మంది గాయాలపాలయ్యారు.
గతేడాది జరిగిన రోజును స్మరించుకోవడానికి ప్రజలు జూన్ 25 బుధవారం వీధుల్లోకొచ్చి నిరసన చేశారు. నిరసనకారుల్ని అదుపు చేయడానికి పోలీసులు జలఫిరంగులను, భాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ముళ్ల కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు వెళ్లే మార్గాలన్నీ బ్లాక్ చేశారు. ఈ ఆందోళనల్లో ఎక్కువగా యువకులే పాల్గొన్నారు. యువకుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనల్లో పాల్గొన్నవారిలో ఎనిమిది మృతి చెందారు. ఈ ఆందోళనల్లో పోలీసు అధికారులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి.