ఆరుగురు అరెస్టు.. నగదు రికవరీ
నవతెలంగాణ- సూర్యాపేట
లబ్దిదారులకు చేరాల్సిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను దారిమళ్లించిన ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కోదాడ టౌన్ పోలీస్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.9.30 లక్షలు, ఐదు సెల్ఫోన్లు, ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 చెక్కులలో 36 చెక్కుల ద్వారా రూ.13.63 లక్షలు నకిలీ లబ్దిదారుల ఖాతాల ద్వారా డ్రా చేసినట్టు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పని చేసిన చెడపంగు నరేష్, ప్రయివేట్ పీఏలుగా ఉన్న మర్ల వీరబాబు, ఉప్పుల మధు కలిసి లబ్దిదారులకు జారీ చేసిన 44 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పక్కన పెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చెక్కులను రీవాలిడేషన్ చేయించి, అదే పేర్లతో ఉన్న ఇతరులను కనుగొని వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం నకిలీ ఖాతాల ద్వారా డబ్బులు డ్రా చేసి, లబ్దిదారులకు చేరకముందే కాజేశారు. వారికి సురగాని రాంబాబు, గుంటుక సందీప్, రంగిశెట్టి వెంకట్రావు సహకరించారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.9.30 లక్షలు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.15.83 లక్షలుగా ఉండగా, అందులో రూ.13.63 లక్షలు ఇప్పటికే డ్రా చేశారు. చెడపంగు నరేష్ వద్ద రూ.1.40 లక్షలు, వీరబాబు వద్ద రూ.90 వేలు, ఉప్పుల మధు వద్ద రూ.2.50 లక్షలు, సురగాని రాంబాబు వద్ద రూ.2.50 లక్షలు, గుంటుక సందీప్ వద్ద రూ.2 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసు ఛేదనలో డీఎస్పీ శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ కె.శివశంకర్, ఎస్ఐ హనుమనాయక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, హరికృష్ణతోపాటు కానిస్టేబుళ్లు చాకచక్యంగా వ్యవహరించారని వారిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మోసం
- Advertisement -
- Advertisement -