– మేలో 22 శాతం పతనం
ముంబయి : వరుసగా ఐదో నెలలోనూ ఈక్విటీ ఫండ్స్లోకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పతనాన్ని చవి చూశాయి. ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లో రూ.19,013 కోట్ల నిధులు మాత్రమే నమోదయ్యాయి. ఇంతక్రితం ఏప్రిల్తో పోల్చితే 21.66 శాతం మేర తగ్గుదల చోటు చేసుకుంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్ఐ) మంగళవారం విడుదల చేసిన గణంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.24,269 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో రూ.25,082 కోట్లు, ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, ఫిబ్రవరిలో రూ.41,156 కోట్లు నిధులు చొప్పున నమోదయ్యాయి. వరుసగా ఐదు నెలలుగా ఈ రంగంలో పెట్టుబడులు, నిధుల ప్రవాహం పడిపోవడం గమనార్హం. ఈక్విటీ ఫండ్స్ కేటగిరీలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.3,841 కోట్లు వచ్చాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ నుంచి రూ.678 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.1,250 కోట్లు నిధులు వచ్చాయి. ఇందులో అంతకుముందు నెల రూ.2,671 కోట్లతో పోలిస్తే తగ్గుదల ఉంది. మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.2,808 కోట్లు రాగా.. ఏప్రిల్లో రూ.3,313 కోట్లుగా ఉన్నాయి. గడిచిన నెలలో స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి రూ.3,214 కోట్లు రాగా.. ఏప్రిల్ నెలలో రూ.3,999 కోట్లుగా చోటు చేసుకున్నాయి.
గడిచిన మేలో సిప్ల ద్వారా ఎంఎఫ్ ఫండ్స్లోకి రూ.26,688 కోట్లు నిధులు రాగా.. ఏప్రిల్లో రూ.26,632 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మే నెలలో 89 శాతం పతనమై రూ.29,572 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెలలో ఏకంగా రూ.2.77 లక్షల కోట్ల ప్రవాహం ఉంది. 2025 మే ముగింపు నాటికి ఎంఎఫ్ సంస్థల మొత్తం ఆస్తుల నిర్వహణ (ఎయుఎం) 3 శాతం పెరిగి రూ.71.39 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్ ముగింపు నాటికి ఈ మొత్తం రూ.69.73 లక్షల కోట్లుగా ఉంది.
మ్యూచువల్ ఫండ్స్లోకి తగ్గిన నిధులు
- Advertisement -
- Advertisement -