వెండి చెంబులో నీటిని సేకరించిన మెస్రం వంశీయులు
కావడి కట్టి ముందుకు ప్రయాణం
నవతెలంగాణ-జన్నారం
ఆదివాసుల ఆరాధ్యదైవం.. ప్రసిద్ధిగాంచిన గిరిజన నాగోబా జాతర ప్రారంభోత్సవానికి అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీయుల పాదయాత్ర కొనసాగుతోంది. డిసెంబర్ 30వ తేదీన కేస్లాపూర్ నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర బుధవారం ఉదయానికి జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేపుకు చేరుకుంది. గంగాజలం కోసం మెస్రం వంశీయులు చేపట్టిన పాదయాత్రలో 146 మంది పాల్గొన్నారు. పాదరక్షలు లేకుండా దాబోలి అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ముండ్ల పొదలు దాటుకుంటూ గంగాజలం తీసుకు వెళ్లడానికి వచ్చారు. ముందుగా మెశ్రం వంశీయులు స్నానాలు ఆచరించి గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కటానా (వెండి చెంబు)లోకి గంగాజలాన్ని స్వీకరించారు. సహప ంక్తి భోజనాల అనంతరం ఆ వెండి చెంబును కావడి కట్టుకొని బయలుదేరి వెళ్లారు. ఈ గోదావరి నీటితో నాగోబాను అభిషేకించిన అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమవుతుంది. కటోడ మెస్రం హనుమంతరావు, కోసేరావు, ప్రధాన్ దాదారావు, కొత్వాల్ తిరుపతి మాట్లాడుతూ.. తరతరాలుగా నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం అడవి దారిగుండానే కాలినడకనే గుట్టల మీదుగా ప్రయాణం సాగిస్తున్నట్టు తెలిపారు. దైవబలమే తమను నడిపిస్తోందని చెప్పారు.
కలమడుగులో గంగాజలం సేకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



