ఎస్ఏ20 ప్రాంఛైజీ బాధ్యతలు చేపట్టిన దాదా
న్యూఢిల్లీ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తొలిసారి ఓ ప్రాంఛైజీ చీఫ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు జేఎస్డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగుతున్న గంగూలీ.. ఈ ఏడాది ఎస్ఏ20 లీగ్లో ప్రిటోరియ క్యాపిటల్స్ (పీసీ)కు చీఫ్ కోచ్గా నియమితులయ్యారు. సెప్టెంబర్ 9న ఎస్ఏ20 ఆటగాళ్ల వేలం ఉండగా.. జొనాథన్ ట్రాట్ స్థానంలో సౌరవ్ గంగూలీ చీఫ్ కోచ్గా రావటం విశేషం. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత 2015-2019 వరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కొనసాగిన గంగూలీ.. 2019లోనే ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా చేరాడు. కానీ 2019లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నిక కావటంతో ప్రాంఛైజీల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎస్ఏ20 తొలి సీజన్లో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ప్రిటోరియ క్యాపిటల్స్ ఫైనల్లో ఈస్టర్న్ సన్రైజర్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలో పీసీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు. ఈ సీజన్లో గంగూలీ శిక్షణ సారథ్యంలో పీసీ టైటిల్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గంగూలీ గతంలో ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటార్, క్రికెట్ డైరెక్టర్గా పని చేశారు.