27 మున్సిపాల్టీల విలీన ఉత్తర్వులు జారీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది. బుధవారం ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేస్తూ…నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో మొత్తం 27 స్థానిక సంస్థలను (పెద్దఅంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్మయాంజల్, మణికొండ, నర్సింగ్, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బండ్లగూడ జగీర్, బడంగ్పేట్, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్) జీహెచ్ఎంసీ లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది.



