నవతెలంగాణ-హైదరాబాద్: పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ లభించింది. దీనిపై కేంద్ర విమానయాన శాఖమంత్రి కె. రామ్మోహన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ‘ఒక శ్రీకాకుళం వాసిగా నాకు ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అవిశ్రాంత కషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత, పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ లభించడం నాకు ఎంతో అనందం గా ఉంది.
ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు.. శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం. మన శ్రీకాకుళం గర్వం ఇప్పుడు నేడు దేశానికే గర్వకారణం. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన, మహాత్మా గాంధీ గారికి ప్రియమైన పోందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును నేసాయి.
ఈ జిఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ అండ్ గ్రామీణ పరిశ్రమల కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన మన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. ఈ జిఐ ట్యాగ్ వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పోందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది’ అని రామ్మోహన్నాయుడు ఎక్స్లో పోస్టు చేశారు.



