- Advertisement -
- సుప్రీం తీర్పు వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సుప్రీంకోర్టు నీట్ విద్యార్ధుల స్థానికతపై ఇచ్చిన తీర్పు వల్ల తెలంగాణ విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. నీట్ స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేవలం 9,10,11,12 తరగతులు మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్థానికతను నిర్ధారించడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోటీ పరీక్షలు కోసం చదువుతున్న తెలంగాణ విద్యార్థులు స్థానికు లుగా మారకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 9,10 తెలంగాణలో చదివి 11,12తోపాటు నీట్ లాంగ్ టర్మ్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోటా, అలెన్, ఆకాశ్, పిట్జీ లాంటి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ తీర్పు వల్ల స్థానికేతరులుగా మారతారని వివరించారు. అలాంటి విద్యార్థులు ఎక్కడ స్థానికులో ప్రభుత్వం తెలుపడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి తాము స్థానికత అంశంపై ఇచ్చిన జీవోలో మార్పులు తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు ఇక్కడే స్థానికులుగా ఉండేలా చూడాలని సూచించారు.
- Advertisement -