ఐదేండ్లలో 91వేల మోసాలు
న్యూఢిల్లీ : దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. గడిచిన ఐదేండ్లలో మొత్తం కంపెనీల ఎగవేతలు రూ.7.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోకసభకు తెలిపారు. కాగా.. ఇందులో ఇన్ఫుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ)కి సంబంధించినవే రూ.1.79 లక్షల కోట్ల మోసాలు జరిగినట్లు తాము గుర్తించామని పంకజ్ చౌదరి వెల్లడించారు. గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2.23 లక్షల కోట్ల పన్ను ఎగవేతలను సీజీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఇందులో 30,056 కేసులలో 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించి రూ. 58,772 కోట్ల నష్టం కలిగించాయన్నారు. 2023-24లో రూ.2.30 లక్షల కోట్లు, 2022-23లో రూ.1.32 లక్షల కోట్లు, 2021-22లో రూ.73,238 కోట్లు, 2020-21లో రూ.49,384 కోట్ల చొప్పున ఎగవేతలను అధికారులు గుర్తించారన్నారు. మొత్తం 91,370 కేసులలో రూ.7.08 లక్షల కోట్ల విలువ చేసే పన్ను ఎగవేతలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కాగా.. ప్రభుత్వం ఇ-ఇన్వాయిసింగ్, జీఎస్టీ అనలిటిక్స్, రిస్క్ పారామీటర్ల ఆధారంగా ఆడిట్, స్క్రూటినీ ఎంపిక వంటి డిజిటల్ చర్యలతో ఎగవేతలను అరికడుతోందన్నారు. ఈ చర్యలు ఆదాయాన్ని కాపాడటంతో పాటు ఎగవేతదారులను పట్టుకోవడంలో సహాయపడుతున్నాయన్నారు.
రూ.7 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు
- Advertisement -
- Advertisement -