ఉచిత బస్సు ప్రయాణం రూ.8402 కోట్లు
రూ.500కు గ్యాస్ సిలిండర్ రూ.700 కోట్లు
200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు రూ.3438కోట్లు
రైతు భరోసా రూ.21426 కోట్లు
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ రూ.20616 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లు రూ.3200 కోట్లు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు రూ.15600 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ. 3000 కోట్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజా ప్రభుత్వం మార్పు దిశగా అడుగులేస్తున్నది. అభివద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి గ్యారంటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేయటంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో రెండుసార్లు గ్రామ సభలు, వార్డు సభలు చేపట్టింది. సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్దిదారులకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో అవసరమైన మేర నిధులు కేటాయించింది.
రెండేండ్లల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో కోటికిపైగా కుటుంబాలకు గ్యారంటీగా ఆర్థిక చేయూతను అందించాయి. ఉచిత బస్ పథకంతో మహిళల సాధికారతకు అడుగులు పడ్డాయి. గ్యాస్ సిలిండర్పై సబ్సిడీతో మహిళలకు బండ భారం తగ్గింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచడంతో పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గహ విద్యుత్ అందించటంతో పేద కుటుంబాలు కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. గడిచిన రెండేండ్లల్లో అభివద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ప్రజాపాలన కొనసాగుతున్నది. ఆర్థికపరమైన కష్టనష్టాలున్నా ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే ప్రాధాన్యతను ఇస్తున్నది.
మహిళలకు వరం.. ఉచిత ప్రయాణం
ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలు, ఆడబిడ్డలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సగటున రోజుకు ఏకంగా 34.32 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నాటికి రూ. 8402 కోట్ల సొమ్మును మహిళలు ఆదా చేసుకున్నారు. చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాలికలకు ఈ పథకం ఎంతో ఊరటనిచ్చింది. బాలికల స్కూల్, కాలేజీల్లో డ్రాపౌట్ శాతాన్ని తగ్గించింది. ఉపాధి కోసం ఊర్లు దాటి వెళితే సగం జీతం బస్ చార్జీలకే పోతుందనుకునే సగటు మహిళకు ఫ్రీ బస్ పథకం వెన్నుదన్నుగా నిలిచింది. రోజువారీగా పనులకు వెళ్లి సంపాదించుకునే మహిళలు డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. పని చేసుకునే మహిళల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
గ్యాస్ బండ భారం నుంచి విముక్తి
పేదింటి మహిళలకు గ్యాస్ ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది. రూ. 500కే గ్యాస్ సిలిండర్ను అందిస్త్తోంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీతో లబ్ది పొందుతున్నాయి. వీరి పేరిట చెల్లించాల్సిన దాదాపు రూ.700 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోంది. అంతమేరకు నెలనెలా భారం తగ్గి సదరు పోగు చేసుకున్న డబ్బులను కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు.
పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గహ విద్యుత్తును అందించే గహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది. దీంతో దాదాపు 52.28 లక్షల కుటుంబాలపై ఆర్థికభారం తగ్గింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.3438 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది.
రైతు భరోసా సాయం
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి భారీ పథకాలు అమలు చేసింది. ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది.
రైతు కూలీలకు ఆత్మీయ భరోసా
తెలంగాణ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సహాయం అందించే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, లబ్దిదారుల ఖాతాల్లో రెండు విడతల్లో రూ.6,000 చొప్పున డబ్బు జమ చేసింది. 2025 జనవరి 26 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
సన్న వడ్లకు రూ. 500 బోనస్
సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రతి క్వింటాల్ కు రూ. 500 అదనంగా బోనస్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లించింది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది.
రూ.2 లక్షల రైతు రుణమాఫీ
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఏకంగా 25.35 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. తొలి ఏడాదిలోనే రూ.20616 కోట్ల మేర రుణమాఫీ చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా గత ప్రభుత్వం కేవలం గొప్పలు మాత్రమే చెప్పుకుని కాలం వెల్లదీసింది. కానీ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతోంది. ఇండ్లు మంజూరైన వారికి మహిళా సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తోంది. ఫలితంగా లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది ప్రతి శాసనసభా నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ. 22,500 కోట్లతో 4 లక్షలా 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు నిర్మాణాలు పూర్తిచేసుకున్న ఇండ్లకు రూ. 3,200 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.
రూ. 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు
గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో పేదల ఆరోగ్య సేవలకు అంతరాయం వాటిల్లింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రజా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు సంకల్పించింది. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 10 లక్షలకు పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకో గలుగుతున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా గుర్తించిన 1835 రకాల జబ్బులకు వైద్యం చేయించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గుండె, కాలేయం, కిడ్నీ జబ్బులు, అవయవ మార్పిడి లాంటి ఖరీదైన చికిత్సలు ఇప్పుడు పేదలకు అందుబాటులోకి వచ్చాయంటే ప్రజా పాలన వల్లనే సాధ్యమైంది. మునుపటిలా వైద్యం కోసం బాధితులు ఎక్కువ సమయం నిరీక్షించకుండానే దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా ఆమోదం పొందే వ్యవస్థను తయారు చేశారు.
ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్
అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం రూ.15600 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈమేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.



