నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. 2009లో ఇదే రోజు (డిసెంబర్ 9) తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలు పెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించాం. స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్గా రూపొందుతోంది. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం డిసెంబరు 9న కావడం మా అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినం. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారు. మా పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోంది’’ అని రేవంత్రెడ్డి అన్నారు.



