Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగులపై పోలీసుల దాడికి హరీశ్‌రావు ఖండన

నిరుద్యోగులపై పోలీసుల దాడికి హరీశ్‌రావు ఖండన

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిన్న దిల్‌సుఖ్‌నగర్‌, నేడు అశోక్‌ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్‌ సర్కారు సాగిస్తున్న దమన కాండ అని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలకు ముందు అశోక్‌ నగర్‌ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని తెలిపారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకుని, కాంగ్రెస్‌ కార్యకర్తలుగా మార్చుకుని ఇంటింటికీ తిప్పి ప్రచారానికి వాడుకున్నారని పేర్కొన్నారు.

అధికార పీఠం ఎక్కగానే నిరుద్యోగుల గొంతులపై ఉక్కుపాదం మోపారని విమర్శించారు. తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నదనీ, పోలీసు రాజ్యం నడుస్తున్నదని తెలిపారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్టుగా ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీచార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని తెలిపారు. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

నిరుద్యోగులపై ప్రభుత్వ దమనకాండ : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌
నిరుద్యోగులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దమనకాండను ప్రయోగిస్తున్న తీరును బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఆకాంక్షలను అడ్డంపెట్టుకుని, తనను నమ్ముతారో నమ్మరో అని రాహుల్‌ గాంధీని రప్పించి, హామీలు గుప్పించి వారి భుజాల మీద ఎక్కి అధికార పీఠాన్ని అధిరోహించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వారి పాలిట ‘యమకింకరుడిలా’ మారడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనలో నిరుద్యోగులకు దక్కింది అడగడుగునా వంచన, అణచివేత తప్ప ఏమీ లేదని తెలిపారు. నిర్బంధాలను తక్షణమే ఆపి, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -