నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్గా మారారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణంలో హరీష్ రావుదే కీలక పాత్ర అని.. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డిల కక్కుర్తి వల్ల కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం మీద సీబీఐ ఎంక్వయిరీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి తనకు కడుపు రగిలిపోతోందని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పులకు, అవినీతికి నా తండ్రి కేసీఆర్ చిక్కుల్లో పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చి చిల్లర కామెంట్స్ చేస్తే ఊరుకోను. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తోలు తీస్తా అని బీఆర్ఎస్ నేతలకు కవిత వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం జరుగుతుందనే ఇన్ని రోజులు హరీష్ రావు, సంతోష్ రావుల పేరు బయటకు తీసుకురాలేదని.. ఇప్పుడు కూడా బయటకు చెప్పకపోతే ప్రజలు కేసీఆర్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది కాబట్టే చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల మీద చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. కేసీఆర్ చేసిన తప్పులు ఏం లేవని.. ఏ ఎంక్వయిరీ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు.