నవతెలంగాణ-హైదరాబాద్: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్.డి.దేవగౌడ మనవడు, జేడీ(ఎస్) మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషిగా నిర్థారించింది. శిక్ష విధింపుపై వాదనలు కొనసాగుతున్నాయి. శనివారం శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజ్వల్పై మూడు అత్యాచారం కేసులు, ఒక లైంగిక వేధింపుల కేసు నమోదు కాగా, విచారణ పూర్తయిన మొదటి కేసు ఇదే. ఈ కేసులో బాధితురాలు హసన్లోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్హౌస్లో సహాయకురాలిగా పనిచేసిన (48)ఏళ్ల మహిళ. అత్యాచారం కేసులో నిందితుడు ప్రజ్వల్పై ఈ ఏడాది మేలో ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించింది. కేవలం రెండు నెలల్లోనే రోజువారీ విచారణలతో దర్యాప్తు పూర్తయింది.
ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని వీడియో తీసి తనను బెదిరించేవాడని 48 ఏళ్ల మహిళ గతేడాది సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 113 మంది సాక్షులతో, 1,632 పేజీల చార్జిషీట్ను సిట్ గతేడాది సెప్టెంబర్లో దాఖలు చేసింది. ప్రజ్వల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.