నవతెలంగాణ-హైదరాబాద్ : సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ మూడు కేసుల్లో కూడా రవిని కస్టడీకి తీసుకుని అదనపు విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే లభించిన సమాచారంతో పాటు మరిన్ని కీలక వివరాలు వెలికితీయడానికి ఈ విచారణ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఐబొమ్మ రవి కేసులో నేడు అత్యంత కీలకంగా మారింది. బెయిల్ పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



